అమరావతి : రాజ్యసభ ఎన్నికలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఖరారు చేసింది. మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోష్, మోపిదేవి వెంకటరమణతో పాటు వైఎస్సార్సీపీ నేత ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పరిమల్ నత్వాని పేర్లను సోమవారం అధికారికంగా ప్రకటించింది. మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్లు ఎమ్మెల్సీలుగా ఎన్నికై మంత్రులుగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే మండలి రద్దు నిర్ణయం నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వీరిద్దరినీ రాజ్యసభ నామినేట్ చేయాలని నిర్ణయించారు. ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ అభ్యర్థన మేరకు పరిమల్ను ఏపీ నుంచి రాజ్యసభకు ఎంపిక చేశారు.
ఈ మేరకు పార్టీ అభ్యర్థులను మంత్రి బొత్స సత్యనారాయణ, ఎంపీ విజయసాయిరెడ్డి, మండలి విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ప్రకటించారు. అనంతరం వీరు మాట్లాడుతూ... ‘ఈనెల 6వ తేదీన రాజ్యసభ ఎన్నిక నోటిఫికేషన్ వచ్చింది. మా పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో అభ్యర్థులను ఖరారు చేశాం. 50 శాతం బీసీలకు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. దానిలో భాగంగానే పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవిలకు రాజ్యసభకు నామినేట్ చేశాం. పార్టీ శ్రేయోభిలాషి ఆళ్ల అయోధ్య రామిరెడ్డిని రాజ్యసభకు ఎంపిక చేశాం. ఇక నాలుగో సీటు పరిమల్ నత్వానికి ఇవ్వనున్నాం. ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ అభ్యర్థన మేరకు ఏపీ నుంచి పరిమల్కు ఇవ్వడం జరిగింది. పరిశ్రమల స్థాపన, అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.’ అని వెల్లడించారు.